త్వ‌ర‌గా గుర్తించ‌గ‌లగాలి..క్యాన్సర్ ప్రాణాంత‌కం కాదు

  • ముంద‌స్తు స్వీయ గుర్తింపుతో చికిత్స‌లో మంచి ఫ‌లితాలు
  • క‌ల్లం అంజిరెడ్డి క‌ళాశాల‌లో ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో క్యాన్సర్ అవ‌గాహ‌న స‌ద‌స్సు
  • విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేసిన డాక్ట‌ర్ భార్గ‌వ‌
డాక్ట‌ర్ భార్గ‌వ‌కు సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: మ‌న దేశంలో వ‌స్తున్న‌ వాటిలో చాలార‌కాల క్యాన్సర్ ఎవ‌రికి వారే కొంత‌వ‌ర‌కు గుర్తించ‌వ‌చ్చ‌ని, దీనిపై స‌మాజంలో విస్తృతంగా అవ‌గాహ‌న రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని న‌గ‌రంలోని ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి హెడ్ అండ్ నెక్ కేన్స‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ భార్గ‌వ సూచించారు. ప్ర‌పంచ క్యాన్సర్ దినం సంద‌ర్భంగా మ‌దీనాగూడ‌లోని క‌ల్లం అంజిరెడ్డి క‌ళాశాల విద్యార్థినీ విద్యార్థుల‌కు శ‌నివారం ఆయ‌న అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. సుమారు వంద మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఈ స‌ద‌స్సులో పాల్గొని త‌మ అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నారు.

విద్యార్థినీ, విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేస్తున్న డాక్టర్ భార్గవ

క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి.. దాని ల‌క్ష‌ణాలేంటి, అది ఏ ద‌శ‌లో ఉందో ఎలా గుర్తిస్తారు, దానికి చికిత్స‌లు ఏమున్నాయనే అంశాల‌పై ప్ర‌ధానంగా డాక్ట‌ర్ భార్గవ వివ‌రించారు. భార‌త‌దేశంలో రొమ్ముకేన్స‌ర్, గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క్యాన్సర్ మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని తెలిపారు. ఈ రెండింటినీ మ‌హిళ‌లు త‌మ‌కు తాముగానే గుర్తించ‌వ‌చ్చ‌ని, రొమ్ములో గ‌డ్డ‌లు క‌నిపించ‌డం, బ్లీడింగ్ ఎక్కువ‌గా కావ‌డం లాంటివి క‌నిపిస్తే వెంట‌నే అనుమానించి వైద్యులను సంప్ర‌దించాల‌ని చెప్పారు. నోటి కేన్స‌ర్ అయితే నోట్లో పుండ్లు రావ‌డం, ర‌క్తం కార‌డం, వాపు లాంటి ల‌క్ష‌ణాలు వ‌స్తాయ‌న్నారు. జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల‌తో పాటు.. పొగ‌తాగ‌డం, పొగాకు న‌మ‌ల‌డం, ఫాస్ట్ ఫుడ్ తిన‌డం, వాయుకాలుష్యం లాంటివాటి వ‌ల్ల సైతం క్యాన్సర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ఈ సంవ‌త్స‌రం ప్ర‌పంచ క్యాన్సర్ దినం థీమ్. అంటే ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స అంద‌డంలో పేద‌లు, ధ‌న‌వంతులు, న‌గ‌ర‌వాసులు, గ్రామీణులు, ఇలాంటి భేద‌భావాలు ఉండ‌కూడ‌ద‌ని, అంద‌రికీ స‌రైన స‌మ‌యానికి చికిత్స అందిస్తే అస‌లు క్యాన్సర్ అనేది ప్రాణాంత‌కం కూడా కాద‌ని తెలిపారు. త‌మ కుటుంబంలో ఎవ‌రికైనా ఇలాంటి ల‌క్ష‌ణాలుంటే ఎలా గుర్తించాలి, అలాగే త‌మ చుట్టుప‌క్క‌ల ఉన్న స‌మాజంలో సైతం క్యాన్సర్ ను గుర్తించే విధానాల గురించి అంద‌రికీ ఎలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న విష‌యాల గురించి విద్యార్థుల‌కు డాక్ట‌ర్ భార్గ‌వ కూలంక‌షంగా చెప్పారు. క్యాన్సర్ నిర్ధారించేందుకు ప‌లుర‌కాల ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని తెలిపారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐల‌తో పాటు.. పెట్ సీటీ స్కాన్ ద్వారా శ‌రీరంలో ఏయేభాగాల్లో క్యాన్సర్ ఎంత తీవ్రంగా ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంద‌న్నారు. బ‌యాప్సీ ప‌రీక్ష ద్వారా కూడా నిర్ధారించిన త‌ర్వాత‌.. శ‌స్త్రచికిత్స‌, కీమోథెర‌పీ, రేడియేష‌న్ థెర‌పీ లాంటివాటి ద్వారా దీనికి చికిత్స‌లు చేస్తామ‌న్నారు. ముఖ్యంగా రేడియోథెర‌పీ, కీమోథెర‌పీల వ‌ల్ల కొంత‌మేర దుష్ప్ర‌భావాలు ఉన్నా.. వాటికి భ‌య‌ప‌డి చికిత్స తీసుకోకుండా మానేయ‌కూడ‌ద‌ని, అలా చేస్తే ప్రాణాల‌కే ముప్పు వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ స‌మాచారాన్ని అంద‌రికీ తెలియ‌జేయాల‌ని, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మ‌హ‌మ్మారిపై స‌మాజంలో అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్ భార్గ‌వ చెప్పారు. అనంత‌రం విద్యార్థినీ విద్యార్థులు వివిధ ర‌కాల క్యాన్సర్లు, అవి రావ‌డానికి ఉండే ప్ర‌ధాన కార‌ణాలు, వాటిని గుర్తించ‌డం, వాటిలో ఉన్న చికిత్స ప‌ద్ధ‌తుల గురించి త‌మ‌కున్న అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here