నమస్తే శేరిలింగంపల్లి: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఏఐఎఫ్ డిడబ్ల్యు ఆధ్వర్యంలో స్టాలిన్ నగర్ లో కట్టెల పొయ్యితో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ ఎం.రాణి మాట్లాడుతూ.. 2014లో కేంద్రంలోనీ బిజెపి అధికారంలోకి వచ్చేనాటికి రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ. 1185 వరకు పెంచిందన్నారు. బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కూడా గ్యాస్ పై వంట చేసుకునే విధంగా.. సామాన్య ప్రజలకు కూడా అలవాటు చేసి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల, లాభాల కోసం ప్రజల పైన గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను మోపుతున్నారని ఆరోపించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏదో రాష్ట్రాల ఎన్నికల తర్వాత వెంటనే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల పైన భారాలు మోపుతుందని అన్నారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, ఏఐఎఫ్ డీ డబ్ల్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఏఐఎఫ్ డీ డబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకురాలు ధార లక్ష్మీ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల దినసరి జీవనం భారమవుతున్న క్రమంలో ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అధిక ధరలను మోపుతున్నారని అన్నారు. ప్రజలపై ధరల భారాలు మోపుకుంటూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా అనుసరిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో గీత, వనజ, మొగులమ్మ, పార్వతమ్మ, అనురాధ, సాలమ్మ, కృష్ణకుమారి, వెంకటలక్ష్మి, కీర్తనమ్మ, నిర్మల, లావణ్య, లత, రాజ్యలక్ష్మి, అనురాధ, పుష్ప పాల్గొని నిరసన తెలిపారు.