శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): నిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేసిన వారిపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బి ఆర్ కే (BRK) అనే యూట్యూబ్ ఛానెల్లో పని చేస్తున్న రవి అనే రిపోర్టర్ ఆయన చానెల్ ద్వారా తాను కష్టపడి కొనుగోలు చేసిన వ్యక్తిగత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుంటే, అది ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్నానని అసత్య వార్తలు ప్రసారం చేశాడని ఆరోపించారు.

తనపై కావాలనే దుష్ప్రచారం చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నారని, మంచి పేరు సంపాదించుకున్న ప్రజా ప్రతినిధిపై బురద జల్లే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా పారదర్శకంగా, ప్రజల విశ్వాసంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన తనపై రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు ప్రత్యర్థులు దళారుల ద్వారా ఈ రకమైన అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా, మంచి మీడియా సంస్థల పేరును అడ్డం పెట్టుకొని కొందరు వ్యక్తులు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుండటం బాధాకరమని, డబ్బులు ఇవ్వనందుకు తనపై కావాలనే తప్పుడు కథనాలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో పలువురిని బెదిరించి వసూళ్లకు పాల్పడిన విషయంపై తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, వాటిని చట్టపరమైన సంస్థలకు అందజేశామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, కానీ వ్యక్తిగత లాభాల కోసం మీడియాను వాడుకుంటే అది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం తప్పకుండా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తక్షణమే బి ఆర్ కే ఛానెల్, అందులో పని చేస్తున్న రవి అనే రిపోర్టర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్న తనపై రాజకీయ కక్షతో దుష్ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టబోమని, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను గుర్తించాలని కోరారు. సత్యమే చివరికి గెలుస్తుందని, అసత్య ప్రచారాలకు చట్టపరంగా సమాధానం ఇస్తామని అన్నారు.





