శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు, చాకలి చెరువు దుర్భర స్థితిలో ఉన్నాయని, వెంటనే ఆయా చెరువుల్లో శుభ్రత పనులు చేపట్టాలని, స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ శనివారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ యాదవ్ మాట్లాడుతూ గోపి చెరువు, చాకలి చెరువుల్లో చెత్త, వ్యర్థాలు తీవ్రంగా పేరుకుపోయాయని, మరోవైపు మురుగు నీరు సైతం కలుస్తుందని అన్నారు. చెరువులో నీరు కాలుష్యమయం అవడం వల్ల పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తుందని, దీంతో అనేక కాలనీలు, బస్తీల వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చెరువులో మురుగు నీరు, వ్యర్థాలు కలుస్తున్న కారణంగా దోమలు విపరీతంగా వృద్ధి చెందాయని, డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధుల ముప్పు నెలకొందని, కనుక వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, చెరువుల శుభ్రత పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ లక్ష్మి, నవీన్ యాదవ్, సుభాష్ రాథోడ్ , లడ్డూ యాదవ్, PNY టీం సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.






