- నిబంధనలు విడుదల చేసిన ఈసీ
- రేషన్ డీలర్ల పోటీ చేయవచ్చు, అంగన్వాడీలకు అవకాశం లేదు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఈ విషయంలో అధికార తెరాస పార్టీ కొంత ముందు ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలపై అనేక మందిలో సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- జూన్ 1, 1994 కు ముందు ముగ్గురు సంతానం ఉన్నవారు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు.
- జూన్ 1, 1994కి ముందు ముగ్గురు, అనంతరం మే 31, 1995 వరకు మరో ఇద్దరు సంతానం కలిగినవారు కూడా పోటీకి అర్హులే.
- జూన్ 1, 1994కి ముందు ముగ్గురు, మే 31, 1995 వరకు మరొకరు, ఆ తరువాత మరొక సంతానం కలిగినవారు పోటీకి అనర్హులు.
- మే 31,1995 నాటికి ఒక సంతానం ఉండి, అనంతరం రెండో కాన్పులో కవలలు జన్మిస్తే వారు పోటీకి అర్హులు. కవలలు కాకుండా ఇద్దరు సంతానం కలిగితే అనర్హులు.
- మే 31, 1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు సంతానం కలిగినవారు అర్హులు.
- ఒక వ్యక్తి తన మొదటి భార్యద్వారా ఇద్దరు సంతానం కలిగి, ఆమె చనిపోయిన తరువాత రెండో భార్య ద్వారా ఒక సంతానం కలిగితే అతను పోటీకి అనర్హుడు. అయితే అతని భార్యకు ఒకే సంతానం అయినందున ఆమె పోటీ చేయవచ్చు.
- అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ నామినేషన్ల పరిశీలన నాటికి అందులో ఒకరు చనిపోతే అతనికి పోటీకి అర్హత లభిస్తుంది.
- నామినేషన్ల పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు ఉండి గర్భవతి అయినప్పటికీ తను పోటీకి అర్హురాలే.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోటీకి అనర్హులు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామాచేసి, అది అధీకృత అధికారి చేత నామినేషన్ల పరిశీలన నాటికి ఆమోదించబడితేనే అర్హత ఉంటుంది.
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రేషన్ షాపు డీలర్లు పోటీకి అర్హులు.
- హైకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.
- నామినేషన్తోపాటు చెక్లిస్టులోనిపత్రాలు సమర్పించని పక్షంలో పరిశీలన రోజున దాన్ని తిరస్కరిస్తారు.
- ఒక అభ్యర్థికి ప్రతిపాదకుడిగా ఉన్న వ్యక్తి అదే డివిజన్ నుంచి పోటీ చేయవచ్చు.
- మతి స్థిమితంగా లేనివారు పోటీకి అనర్హులు. ఫిర్యాదుదారు చట్ట ప్రకారం దానిని నిరూపించాలి.