శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి బెల్లి లలిత స్ఫూర్తితో బీసీల సాధికారత కోసం పోరాడుదామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్ అన్నారు. 26వ వర్ధంతి సందర్భంగా భువనగిరిలో బెల్లి లలిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. బెల్లి లలిత అందించిన స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడినందుకే అప్పటి పాలకవర్గాల చేతుల్లో బెల్లి లలితతో పాటు సాంబశివుడు, కోనపురి రాములు హత్యగావిచబడ్డారని అన్నారు. ఉద్యమాలు కొనసాగినంత కాలం అమరవీరుల స్ఫూర్తి బాధితులు, పీడితుల్లో పోరాటాలను రగిలిస్తూనే ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామ్ చందర్ యాదవ్, బెల్లి చంద్రశేఖర్, కోనపూరి కవిత, శ్రీకృష్ణ యాదవ సంఘం భువనగిరి జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, అయోధ్య యాదవ్, బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు వాసు కె యాదవ్ పాల్గొన్నారు.