శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్, గోపినగర్ లలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. అనంతరం డ్రైనేజీ, పలు సమస్యలపై స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పారిశుధ్య పనులు క్రమంగా నిర్వహించడం లేదని, ఓపెన్ డ్రైనేజీ చెత్త నిండిపోయి ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. పలు సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోగా, మరికొన్నింటిని త్వరలో పరిష్కరిస్తామని స్థానికులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ను తొలగించి క్రమబద్ధంగా అమర్చుటకై సంబంధిత ఏఈ వెంకట్ రామ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశాగారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ప్రభాకర్, మహేష్ చారీ, వీరేందర్, జనార్దన్, చంద్రయ్య, శంకరయ్య, సైదులు, దస్తగిరి, ఇమ్రాన్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.