శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ విజయానికి పునాది వేస్తుందని, పరీక్షలో అద్భుతమైన మార్కులు సాధించడంలో ప్రిపరేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని శ్రీ విద్యాస్ అభ్యాసన సిఈఓ చైతన్య కృష్ణ అన్నారు. పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయిన సందర్బంగా అత్యంత మార్కులు సాధించిన విద్యార్థులను చైతన్య కృష్ణ అభినందించారు. ఈ ఫలితాలలో శ్రీ విద్యాస్ అభ్యాసన పాఠశాల విద్యార్ధిని వి.దీక్షిక రాష్ట్ర స్థాయిలో ఎంపిసి విభాగంలో 120 కి 120 మార్కులకు మొదటి ర్యాంక్, ఎంబైపిసి విభాగంలో 150 కి 148 మార్కులకు 8వ ర్యాంక్ సాధించింది. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచి 590 మార్కులు సాధించింది. ఇంతటి విజయాన్ని సాధించిన దీక్షికను పాఠశాలల సిఈఓ చైతన్య కృష్ణ, జిఎం నరేష్, ప్రధానోపాధ్యాయురాలు నాగ వల్లి, డీన్ సంతోష్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని వారు ఆకాంక్షించారు.