నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ శిల్పారామం లో అల్ ఇండియా సారీ మేళ, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ పండగ సందర్భంగా మహిళా సిబ్బంది బంతిపూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళలు ప్రతి రోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు దాండియా ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

యంపీ థియేటర్ లో రాధా నృత్య నిలయం రాధా మోహన్ శిష్య బృందం చే దుర్గ భరతనాట్య నృత్యాన్ని ప్రదర్శించారు. మహిషాసురుడు అనే రాక్షసుని భారి నుంచి ప్రజలను అమ్మవారు రక్షించిన వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంప నాగేశ్వర్ రావు, డాక్టర్ పసుమర్తి శేషు బాబు, డాక్టర్ నవీన్ హాజరై కళాకారులను సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతరించిపోతున్న కళలను, కళాకారులను కాపాడుకుంటుందని ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. కళాకారులను గుర్తించి ప్రోత్సహకాలు అందజేస్తుందని అన్నారు. చేనేతల నుంచి అన్ని రంగాల వారిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని చెప్పారు.






