శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో దారా లక్ష్మయ్య గుప్తా ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు పోలైన మొత్తం 27 ఓట్లు రావడం విశేషం. దీంతో ఆయన మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మండల పరిధిలో మొత్తం 44 మంది అర్హులైన ఓటర్లు ఉండగా, 27 మంది ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన అన్ని ఓట్లు దారా లక్ష్మయ్య గుప్తాకే దక్కడం సభ్యులు ఆయనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా చందానగర్, శాంతినగర్, ఆర్కే నగర్, కొండాపూర్, మియాపూర్, పాపిరెడ్డి కాలనీ, ఆంజనేయ నగర్, మయూరి నగర్, హఫీజ్పేట్ బస్తీ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు ఐక్యతను చాటుతూ ఎన్నికల ప్రక్రియకు మద్దతుగా నిలిచారు. వారందరికీ నూతన అధ్యక్షుడు, సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా దారా లక్ష్మయ్య గుప్తా విజయాన్ని ఒక్క వ్యక్తి విజయంగా కాకుండా బస్తీ సంఘాల ఐక్యతకు, మొత్తం ఆర్యవైశ్య సమాజానికి లభించిన విజయంగా అభివర్ణించారు. సంస్థల మధ్య భేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని సమాజ సేవ, అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐక్యతే మన బలం.. సేవే మన లక్ష్యం.. సమాజ అభ్యున్నతే మన సంకల్పం అనే నినాదంతో ముందుకు సాగుతామని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఎవరు గెలిచినా అంతిమంగా ఆర్యవైశ్య సమాజ ఐక్యత, అభ్యున్నతే లక్ష్యమని స్పష్టం చేశారు. జై వాసవి.. జై ఆర్యవైశ్య ఐక్యత అంటూ నూతన అధ్యక్షుడి ఎన్నికను సంఘం సభ్యులు ఆనందంగా స్వాగతించారు.





