- వ్యాపార వస్తువుగా జనన, మరణ ధ్రువపత్రాలు
- జనన మరణాల దృవీకరణ చట్టం 1969, నమోదు నియమావళి 1999కి తూట్లు
- దశాబ్దాల కిందటి పత్రాల్లోని పేర్లు మార్చి కొత్తగా జారీ చేస్తున్న వైనం
- పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ఐడెంటిటీకి అనువైన మార్గం
- అడిగినంత ఇస్తే ఆమోదం, లేదంటే తిరస్కరణ.. ఆపరేటర్ ఇష్టారాజ్యంగా ధ్రువపత్రాల జారీ
శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): పుట్టిన ప్రతి బిడ్డకు జనన, అదేవిధంగా మృతిచెందిన వారికి మరణ ధృవీకరణ పత్రం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు. దాన్ని విధిగా నమోదు చేయడం ప్రభుత్వం బాధ్యత. ఎవరు పుట్టినా లేదా చనిపోయినా వాటిని తప్పనిసరిగా రికార్డుల్లో చేర్చాల్సిందే. భాగ్యనగరంలో ఈ బాధ్యతను జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తొంది. ఐతే ఈ జనన మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారం కలిగిన ఉప వైద్యాధికారుల నిర్లక్షమో లేక కాసుల కక్కుర్తో కానీ… వారి కింద పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లకు సరెండర్ అయిపోయారు. దింతో అవుట్ సోర్సింగ్ లో వచ్చి తిష్టవేసిన ఆపరేటర్లు తెగ రెచ్చిపోతున్నారు. వారి అవినీతి చర్యలతో బర్త్ & డెత్ సర్టిఫికెట్ల జారీ మాంచి వ్యాపార వస్తువుగా మారింది.
‘ఇన్ట్సెంట్ ఆఫ్రూవల్’ తో అవినీతికి చెక్…
జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో గతంలో భారీ అవినీతి జరిగేది. ఈ క్రమంలో ఆ అవినీతిని చెక్ పెట్టాలన్న ఉద్ధేశంతో 2022 ప్రారంభంలో ‘ఇన్ట్సెంట్ ఆఫ్రూవల్’ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది నాటి ప్రభుత్వం. నేటికి అదే పద్దతి అమలు అవుతుంది. దవాఖానల్లో జరిగే జననాలు, మరణాల వివరాలను ఆసుపత్రి సిబ్బంది అక్కడే జీహెచ్ఎంసీ సంబధిత ఆన్ లైన్ లో పొందు పరుస్తారు. వాటి ఆధారంగా సంబంధిత అధికారులు జనన, మరణాలను దృవీకరిస్తూ ఆన్ లైన్ లోనే ఆమోదిస్తారు. ఆ పత్రాలను అర్జీదారులు నేరుగా మీ సేవల నుండి ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ అర్జీదారుడికి జీహెచ్ఎంసీ సిబ్బంది మధ్య ఎలాంటి ప్రమేయం ఉండదు కాబట్టి అవినీతికి ఆస్కరం లేకుండా పోయింది. అప్పటి వరకు పెద్దమొత్తంలో అవినీతి సంపాదనకు అలవాటు పడిన ఆపరేటర్లు, వారి పై అధికారులు కొత్త దారులు వెతుకున్నారు.
జనన మరణాల చట్టం 1969 ప్రకారం పేరు మార్పుకు అవకాశమే లేదు…
GHMC ప్రాథమికంగా జనన మరియు మరణాల నమోదు చట్టం 1969 మరియు తెలంగాణ జనన మరణాల నమోదు నియమావళి 1999 అనుసరించి ఒకసారి జనన మరణ దృవీకరణ పత్రం మంజూరయ్యాక ఆ పేరులో మార్పులు చేసే అధికారం ఎవరికి లేదు. ఆ పేరు మార్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా గెజిట్ విడుదల చేసుకోవాల్సిందే. ఐతే ఆసుపత్రి సిబ్బంది తప్పిదాల వల్ల తల్లితండ్రుల పేర్లు ఇతర వివరాలలో తప్పులు దొరలితే మాత్రం వాటిని సవరించుకోడానికి అవకాశం కల్పించింది జీహెచ్ఎంసీ. అందుకోసం మీ సేవ సెంటర్లలో అర్జీ చేసుకోవాలి. పేరు మినహా మిగిలిన ఏం తప్పులు ఉన్నాయో వాటిని సవరించడానికి సంబంధిత ఆధారిత పత్రాలను జతపరచాలి. వాటిని ఆన్ లైన్ లోనే పరిశీలించి సంబంధిత అధికారులు ఆమోదం తెలిపాలి. దింతో తిరిగి మీ సేవలో మార్పు చెందిన పత్రాలను పొందవచ్చు. ఐతే ఈ చిన్న వెసులుబాటును తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు అధికారులు ముఖ్యంగా ఆపరేటర్లు. మార్పులు చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆమోదం తెలపకుండా రోజులు, వారాలు, నెలల తరబడి పెండింగులో ఉంచుతున్నారు. దీంతో అర్జీదారులు తమ బాధ విన్నవించుకోడానికి నేరుగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చేస్తారు. దీంతో వాళ్లతో నేరుగా బేరం కుదుర్చుకుంటున్నారు కంప్యూటర్ ఆపరేటర్లు. బాధితుడి పరిస్థితి, అవసరాన్ని బట్టి వేల రూపాయలు దండుకొని పత్రాలు జారీ చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వలేని వారి దరఖాస్తులను ఇష్ట రాజ్యాంగా తిరస్కరిస్తున్నారు.
చందానగర్ సర్కిల్ లో ఏ మార్పు ఐనా సులువే…
చందానగర్ సర్కిల్ జనన మరణ దృవీకరణ విభాగంలోని కంప్యూటర్ ఆపరేటర్ అవినీతిలో ఒక ఆకు ఎక్కువే చదివింది. జనన దృవీకరణ పత్రాల్లోని అసలు పేరు మినహా మిగిలిన తప్పులను మాత్రమే సవరించాల్సిన నిబంధనను తుంగలో తొక్కింది. తాను అడిగిన మొత్తం ఇస్తే ఏకంగా పేరునే మార్చేస్తోంది. వేల రూపాయలు దండుకోని 10 లేద 20 ఏళ్ల క్రితం మంజారైన పత్రాలలోని పేర్లను సైతం పూర్తిగా మార్చేస్తోంది. తాను అడిగినంత రొక్కం చెల్లించని వారి దరఖాస్తులను మాత్రం పెండింగ్ లో పెడుతుంది. తమ సర్టిఫికెట్ ఎందుకు రిజెక్ట్ చేశారొ, ఎందుకు పెండింగ్ లో ఉందో తెలియక కొందరు.. తమ పత్రాలు పొందడానికి కావలసిన వివరాలు తెలియక ఎందరో వృద్ధులు, బాలింతలు తమ పిల్లలతో చందానగర్ సర్కిల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. కావలసిన అన్ని పత్రాలు జత చేసిన కూడా పొంతన లేని పత్రాలు సమర్పించాలని ఇబ్బందికి గురి చేస్తుందని పలువురు అర్జీదారులు “నమస్తే శేరిలింగంపల్లి” ప్రతినిధితో తమ ఆవేదన పంచుకున్నారు. అంతేకాదు సదరు ఆపరేటర్ ఉదయం 11.30 దాటితే గాని విధులకు రారని, సాయంత్రం 4 దాటితే ఆఫీస్ లొ కనపడదని వాపోయారు. ఐతే ఈ విషయమై సర్కిల్ మెడికల్ ఆఫీసర్ పలు మార్లు సదరు కంప్యూటర్ ఆపరేటర్ ని హెచ్చరించినా వారి మాటను కూడా బెఖాతరు చేస్తున్నారని సర్కిల్ ఆఫీస్ లోని తోటి ఉద్యోగులు గుస గుసగుసలాడుతున్నారు.
దృవపత్రాల మార్పులో “లలిత” కళలు…
శేరిలింగంపల్లి మండలం గోపినగర్ కి చెందిన అస్మ బేగం, షకీల్ పాషాలు 2023 మే 9వ తేదీన తమ కూతురు పేరును Yusnira Fahim గా నమోదు చేయించారు. ఐతే తాజాగా రెండేళ్ల తర్వాత అంటే 2025 మే 14న ఆ పేరును Iqra kainaat గా మార్చేసారు. జిహెచ్ఎంసి జనన మరణాల యాక్ట్ లోని ఏ నిబంధన ప్రకారం ఈ పేరును మార్చారో వారికే తెలియాలి. ఇదిలా ఉంటే 2011 ఏప్రిల్ 27న సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బాంబే కాలనీకి చెందిన షేక్ సలీమ్, ఫర్జాన భేగంలు తమ కూతురు NAZMIN పేరిట బర్త్ సర్టిఫికెట్ ను చందానగర్ సర్కిల్లో తీసుకున్నారు. ఐతే 14 ఏళ్ల తర్వాత సదరు సర్టిఫికెట్ లోని తండ్రి పేరైన ఎండీ సలీంను షేక్ సలీంగా మారుస్తూ 2025 మే 14 న కొత్త సర్టిఫికేట్ జారీచేశారు. నిజానికి MD ఉంటే మహమ్మద్ గా, SK ఉంటే షేక్ గా పూర్తి ఫామ్ లోకి మార్చుకోవచ్చు. కాని ఇక్కడ ఏకంగ ఇంటి పేరునే మార్చేసారు. ఇంకో విషయానికి వస్తే ఏకంగా ఒకే నమోదు పత్రానికి సంబంధించి బాధితులు 5 సార్లు దరఖాస్తు చేసుకోవడం విచిత్రం. అంటే ఇక్కడ నాలుగు సార్లు ఫైల్ రిజెక్ట్ అవ్వగా ఐదోసారి బేరం కుదిరినందుకు కొత్త సర్టిఫికెట్ జారీ అయిందని తేటతెల్లం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చందానగర్ సర్కిల్ లో దృవపత్రాల మార్పులు కోకొల్లలు. ఇక రొక్కం చెల్లించుకోలేక, తమ ధ్రువపత్రాల్లో మార్పులు చేర్పులు చేసుకోలేక అవస్థలు పడుతున్న వారి సంఖ్య వందల్లో ఉంది.
పాకిస్థాన్, బాంగ్లదేశ్ వాసులైతే..?
రెండు దశాబ్ధాల కింద జారీ చేసిన దృవపత్రాలలోని పేర్లను, ఇతర వివరాలను సునాయసంగా మార్చేస్తున్న సదరు ఆపరేటర్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి అక్రమంగ వచ్చిన వారికి ధ్రువపత్రాలను ఇవ్వలేదని గ్యారెంటీ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత డేట్ లోని పత్రాల్లో మార్పులు చేసి గుర్తుతెలియని వ్యక్తులకు కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం లేకపోలేదు. ఇటీవల నార్సింగి మున్సిపాలిటీలో బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసిన విషయంలో అక్కడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ పై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. చందానగర్ సర్కిల్లో కూడా సంవత్సరాల కిందటి పాత ధ్రువీకరణ పత్రాల్లోని పేర్లను మార్చేసి కొత్తగా జారీ చేసిన వాటిని పునః పరిశీలించి దేశ రక్షణ విషయంలోనూ దృష్టి సారించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

సూచిక బోర్డుల్లేవు… తనిఖీల జాడ లేదు…
జనన మరణ ధ్రువపత్రాల్లోని చిన్న చిన్న మార్పుల కోసం ఎవరిని సంప్రదించాలి, మీ సేవలో ఏ ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి, అందుకు ఎంత సమయం పడుతుంది అనే అవగాహన కల్పిస్తూ సర్కిల్ కార్యాలయాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సేవ లొ దరఖాస్తు చేసుకున్న అర్జీలకు 6 రోజులలో సర్టిఫికెట్ వస్తుందని సదరు మీసేవ రసీదు పై రాసి ఉంటుంది. కానీ 15 రోజులు గడిచిన సర్టిఫికెట్లు అప్రూవల్ అవ్వడం లేవు. చాల వరకు 15 రోజుల తరువాత రిజెక్ట్ అవుతున్నాయి. నిజానికి హెడ్ ఆఫీస్ నుండి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMOH) తరచూ సర్కిల్లోని జనన మరణ ధ్రువీకరణ విభాగాలను సందర్శించి అక్కడ పరిస్థితులను ఆరా తీయాల్సి ఉంటుంది. అదేవిధంగా సామాన్య ప్రజలకు ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిహెచ్ఎంసి హెల్త్ విభాగం అడిషనల్ కమిషనర్ పై ఉంటుంది. కానీ చందానగర్ సర్కిల్ లోని బాధితుల ఆవేదన అర్థం చేసుకునే అధికారే కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చందానగర్ సర్కిల్ లో జరుగుతున్న బర్త్ & డెత్ సర్టిఫికెట్ల బాగోతంపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
చందానగర్ సర్కిల్ రెవెన్యూలో “విజయ” చక్రవర్తి…
తదుపరి సంచికలో మరో అవినీతి బాగోతం..