శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్పాస్ సమీపంలో ప్రమాదవశాత్తూ నాలాలో గల్లంతైన బాలయ్య(70) కోసం హైడ్రా, సీఎంసీ, డీఆర్ఎఫ్ తదితర బృందాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను ఆయన రామకృష్ణ నగర్, మంజీరా రోడ్డు పైప్లైన్ ప్రాంతం, వైశాలి నగర్ నాలా వద్ద అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎంసి సిబ్బంది, రాష్ట్ర డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సీఎంసీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. గల్లంతైన వ్యక్తి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న హైడ్రా, పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర విభాగాల సిబ్బందిని అభినందించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్న ఆయన, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ సహకార భావంతో వ్యవహరించి సహాయక చర్యలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేఖర్ ముదిరాజ్, రవికుమార్ నాయీ, కట్ల శేఖర్ రెడ్డి, బాలకృష్ణ, సాయి యాదవ్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్, కార్తీక్ గౌడ్, నర్సింగ్ రావు, నవీన్ యాదవ్, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.





