శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ పోలింగ్ బూత్లను సందర్శించి, బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఓటర్ల నమోదు, వివరాల సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను ఒకసారి పరిశీలించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని, ప్రతి అర్హ పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఓటర్ల జాబితాను మరింత కచ్చితంగా రూపొందించే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమానికి గడువు తక్కువగా ఉన్నందున ప్రజలు చురుకుగా పాల్గొని తమ ఓటరు వివరాలను ధ్రువీకరించుకోవడం ఎంతో అవసరమని మిరియాల ప్రీతమ్ తెలిపారు.





