శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ అధికారి బి.అర్ముగంకు పలువురు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, చందానగర్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డిలు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన చందానగర్ పోస్ట్ ఆఫీస్ ను శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ ఇంచార్జ్ , కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ సందర్శించారని అన్నారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి వివరించడం జరిగిందన్నారు. ఎంపీ ఇచ్చిన లేఖను పోస్టల్ అధికారులకు అందజేయడం జరిగిందని, చందానగర్ పోస్టాఫీస్ను మొదటి అంతస్తులో కాకుండా ప్రజల సౌకర్యార్థం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించారని అన్నారు.