శేరిలింగంపల్లి, జూలై 30 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లో చోటు చేసుకున్న 100 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే ఛేదించి నిందితురాలిని గుర్తించారు. ఆమె వద్ద నుంచి పూర్తి స్థాయిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న వడ్ల తార తన కోడలు గర్భవతిగా ఉండటంతో సంగారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ఆమె పిన్ని కూతురు వినయ భాను ఇంటికి వచ్చి చీర తీసుకెళ్లే క్రమంలో అక్కడ ఉన్న 100 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా తీసుకుని వెళ్లింది.

తిరిగి ఇంటికి వచ్చిన తార బంగారం కనిపించకపోవడంతో ఈ నెల 24న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి అనుమానితులను విచారించారు. దర్యాప్తులో భాగంగా ఐదు రోజుల్లోనే వినయ భానును గుర్తించారు. విచారణలో వినయ భాను చోరీ చేసినట్లు అంగీకరించడంతో ఆమె వద్ద నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కోర్టులో సమర్పించిన అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక బాధితురాలికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.





