తెలంగాణ మంత్రులను కలిసిన సగర సంఘం నేతలు

శేరిలింగంపల్లి: ఆత్మ గౌరవ భవనం కోసం ముందుగా కేటాయించిన స్థలాన్ని మార్చొద్దని కోరుతూ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో ఆదివారం ఆ సంఘం నాయకులు రాష్ట్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేశారు. కోకాపేటలో ప్రభుత్వ GO ప్రకారం ముందుగా కేటాయించిన 100 ఫీట్ల మెయిన్ రోడ్డు స్థానంలోనే సగర సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణం జరగాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర BC సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ ను, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ తమ డిమాండ్ల పట్ల మంత్రులు సానుకూలంగా స్పందించారని, ఆత్మ గౌరవ భవనాల పేరుతో కేటాయించిన స్థలాన్ని మార్చి తమ కులం ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయవద్దని కోరారు. కొందరు అధికారులు కుట్రలు చేసి స్థలాన్ని మార్చాలని ప్రయత్నం చేశారని అన్నారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించారని, మంత్రి హామీ పై తమకు నమ్మకముందని తెలిపారు. మీకు కేటాయించిన స్థలం మీకే ఉంటుందని, మార్పులు లేకుండా చూస్తామని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారని తెలిపారు.
మంత్రులను కలిసినవారిలో రాష్ట్ర సగర సంఘం ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సాగర్, రాష్ట్ర సగర యువజన సంఘం అధ్యక్షులు పెద్ద బుద్దుల సతీష్ సాగర్, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి సందు పట్ల రాము సాగర్, రాష్ట్ర మాజీ యువజన సంఘం కోశాధికారి వేముల భాస్కర్ సాగర్, రాష్ట్ర యువజన సంఘం నాయకులు సందుపట్ల సాయిగణేష్ సాగర్, యువజన సంఘం నాయకులు మహేందర్ సాగర్, నార్ల కంటి నరేందర్ సాగర్, బంధుమిత్రులు పాల్గొన్నారు.