- ప్రభుత్వ విప్ గాంధీకి గోపన్పల్లి తండా బంజార యువజన సంఘం వినతి
నమస్తే శేరిలింగంపల్లి: గోపన్పల్లి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉన్న పార్కు స్థలాన్ని పోలీసు విభాగానికి కేటాయించకుండా చూడాలని కోరుతూ గోపన్పల్లి తండా బంజారా యువజన సంఘం నాయకులు ప్రభుత్వ విప్ గాంధీకి ఆదివారం వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో గల 3.36 ఎకరాల భూమిలో 1623 చ.గ ల విస్తీర్ణంలో ఫంక్షన్ హాలు, 300 చ.గ ల స్థలంలో కమ్యూనిటీ హాలు, 300 చ.గ ల స్థలంలో ఇందిర గాంధీ మహిళా భవన్ తో పాటు కొంత మిగులు స్థలం ఉందని తెలిపారు. గోపన్ పల్లి గ్రామంలో సుమారు 5 వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారని, గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఈ స్థలం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. స్థానికులు గత 40 సంవత్సరాలుగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, విందు తదితర కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారని తెలిపారు. కాగా శనివారం కొందరు పోలీసు అధికారులు 50-60 మంది సిబ్బంది తో వచ్చి తమ గ్రామంలోని స్థలంలో సర్వే నిర్వహించారని తెలిపారు. విచారించగా 5120 గజాల స్థలాన్ని ట్రాఫిక్ పోలీసుల శిక్షణ కేంద్రం కోసం కేటాయించారని అధికారులు తెలిపారన్నారు. ఎంతోకాలంగా తాము వినియోగించుకుంటున్న స్థలాన్ని పోలీసు విభాగానికి కేటాయించడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి గోపన్ పల్లి ఖాళీ స్థలాన్ని స్థానికులకే ఉపయోగపడేలా చూడాలని యువజన సంఘం సభ్యులు గాంధీని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో టీఆర్ఎస్ గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, గోపన్పల్లి తండా బంజారా యువజన సంఘం అధ్యక్షుడు బదావత్ సురేష్ నాయకులు, ప్రతినిధులు రాజు, పాండు, బబ్లు, ప్రవీన్, రాకేష్, శంకర్, హనుమంతు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
