- డ్రగ్స్ వినియోగించిన 24 మంది అరెస్ట్
- పోలీసుల అదుపులో పబ్ మేనేజర్ ఆర్ . శేఖర్.. పరారీలో మరో ముగ్గురు పబ్ ఓనర్లు
- వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్
నమస్తే శేరిలింగంపల్లి : పక్కా సమాచారం మేరకు ఓ బార్ లో నార్కోటిక్స్, ఎస్ ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ వినియోగించిన 24 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. రాయదుర్గం ఖాజాగూడా లోని కేవ్ బార్ అండ్ లాంజ్ లో ఫారెస్ట్ సైకడాలిక్ థీమ్ తో ఆదివారం రాత్రి నిర్వహించిన పార్టీలో 55 మంది పాల్గొనగా.. అందరికీ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ వచ్చిందని, ఆ 24 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సైకడాలిక్ థీమ్ లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ హై పిచ్ లో ఉంటుందని, డ్రగ్స్ తీసుకున్న వారు మాత్రమే ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయగలరని, సామాన్యులు అంతటి డెసీబెల్స్ శబ్దాన్ని వినలేరని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పార్టీకి హాజరైన వారిలో టీసీఎస్, అమెజాన్ తో పాటు ప్రముఖ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారని డీసీపీ వెల్లడించారు. డీజె అబ్దుల్ ఆయూబ్, గౌరంగ్ ఉన్నారని, పబ్ మేనేజర్ ఆర్. శేఖర్ ను అదుపులోకి తీసుకున్నామని, నలుగురు పబ్ ఓనర్లలో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. 24 మందిపై ఎన్ డి పి ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం పబ్ ను క్లోస్ చేస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.