నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఆల్ ఇండియా సారీ మేళ, నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. బెంగాలీ కాటన్, తస్సార్, మస్లిన్, కాంత వర్క్ చీరలు, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, ఉప్పాడ, మదనపల్లి పాటు, చీరాల కాటన్, మంగళగిరి కాటన్, కోట, మహేశ్వరి, చెందేరి చీరలను స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. ఈ సంవత్సరం మంచి రంగులతో వివిధ రకాల డిజైన్స్ తో చేనేతలు తయారు చేసిన చీరలు ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చింత రవి బాల కృష్ణ శిష్య బృందం చేసిన కూచిపూడి ప్రదర్శనలో ఉత్తుకాదు కీర్తన, చిదంబర స్తవం, నగుమోముపై ప్రదర్శించగా జ్యోస్నా శిష్య బృందం కూచిపూడి ప్రదర్శనలో వినాయక కౌతం, మహతి కళాక్షేత్ర శిష్య బృందం తాడేపల్లి సాయి కృష్ణ బృందం కూచిపూడి యక్షగానం లో రుక్మాంగద యక్షగానం ప్రదర్శించారు.
