జాబ్ ఇప్పిస్తాన‌ని చెప్పి మోసం.. రూ.3 ల‌క్ష‌ల‌కు టోపీ..

శేరిలింగంప‌ల్లి, మే 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ ఉందంటే న‌మ్మి డ‌బ్బులు చెల్లించిన ఓ వ్య‌క్తి మోస‌పోయాడు. గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తి (32)కి మాదాపూర్‌లోని ఓ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌కు చెందిన హెచ్ఆర్ ఉద్యోగిని అంటూ ఓ వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. గ‌చ్చిబౌలిలోని త‌మ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంద‌ని, రూ.3 ల‌క్ష‌లు చెల్లిస్తే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా జాబ్ వ‌చ్చేలా చేస్తాన‌ని ఆ వ్య‌క్తి చెప్ప‌డంతో బాధితుడు అలాగేన‌ని చెప్పి అత‌నికి కావల్సిన మొత్తం అంద‌జేశాడు. త‌రువాత బాధితుడికి ఆ వ్య‌క్తి ఆఫ‌ర్ లెట‌ర్‌ను ఇవ్వ‌డంతోపాటు ఉద్యోగంలో చేర్చుకున్నామ‌ని చెబుతూ అత‌నికి వెల్క‌మ్ కిట్‌ను, ల్యాప్‌టాప్‌ను అంద‌జేశాడు.

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ట్రెయినింగ్ ఇస్తున్న‌ట్లు చెప్పాడు. ఈ క్ర‌మంలో తాను జాబ్ లో చేరాన‌ని అనుకున్న బాధితుడు మొద‌టి నెల జీతం పొందాడు. కానీ త‌రువాత నెల నుంచి జీతం అంద‌లేదు. దీంతో అనుమానం వ‌చ్చిన అత‌ను మాదాపూర్‌తోపాటు గ‌చ్చిబౌలిలో ఉన్న ఆ కంపెనీ ఆఫీస్‌ల‌కు వెళ్లి చూడ‌గా అవి మూత‌ప‌డి ఉన్నాయి. త‌న‌కు హెచ్ఆర్ అని ప‌రిచయం చేసుకున్న వ్య‌క్తికి ఫోన్ కాల్ చేస్తే స్విచాఫ్ వ‌చ్చింది. దీంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌గా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జాబ్ ఇప్పిస్తామంటూ డ‌బ్బులు అడిగే వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని పోలీసులు ఈ సంద‌ర్భంగా యువ‌త‌ను హెచ్చ‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here