శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా శుక్రవారం చందానగర్లోని వేముకుంట, గౌతమినగర్లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ నెల 9వ తేదీ ఆదివారం జరగనున్న బోనాల మహోత్సవాల కోసం దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాలయ ట్రస్టీ, మాజీ కౌన్సిలర్ గుఱ్ఱపు రవీందర్ రావు తెలిపారు. బోనాల ఉత్సవాలకు భక్తులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.





