శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ (CITU) పిలుపునిచ్చింది. ఈ మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను విడుదల చేసినట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తోందని, మరోవైపు అమెరికాతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి విస్తృతంగా వస్తే దేశీయ రైతులు అప్పుల బారిన పడే ప్రమాదం ఉందని, వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.





