శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం: మాధవరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని జనసేన పార్టీ, శేరిలింగంపల్లి ఇన్ చార్జి డా. మాధవ రెడ్డి తెలిపారు. చందానగర్ రైల్వేస్టేషన్ నుండి రెండో విడత పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ తాను చేపట్టిన పాదయాత్రకు సహకరిస్తున్న జన సైనికులు , వీర మహిళలు, ప్రజలకు పవన్ కళ్యాన్ అభిమానులకు, స్థానిక చందానగర్ ప్రజానికానికి పాదాభివందనాలు తెలిపారు.

పాదయాత్రలో ప్రజల నుంచి వెలువడుతున్న సమస్యలను తెలుసుకుని, శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అధికార మార్పిడిని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పాదయాత్రలో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా యువత, విద్యావంతులు, సీనియర్ సిటిజెన్లు, మేధావులు ఎంతో మంది వారి వారి సమస్యలని తమ దృష్టికి తెచ్చారన్నారు. జన సేన పార్టీ అధికారంలోకి వస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని భాగ్యనగరంలోనే అత్యున్నతమైన, అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వ భూములను, ప్రభుత్వ చెరువులను కబ్జా కాకుండా నివారించి, డివిజన్ లోని పిల్లలకు, వృద్ధులకు సైతం కావాల్సిన ఆటల స్థలాలను ఏర్పాటు చేస్తామన్నారు. వారు సేద తీరేందుకు వీలుగా, పర్యావరణ సమతుల్యతను కాపాడేలా విధిగా పార్కులను ఏర్పాటు చేస్తానని చెప్పారు.

అదేవిధంగా డివిజన్ లోని మురికివాడల పిల్లలకు, ప్రాథమిక విద్యను నేర్పేందుకు ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. రోజు వారి అడ్డ కూలీలకు గద్దర్ అన్న ఉచిత ఆహార క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. డివిజన్ లోని చిట్ట చివరి పౌరుడు, చిట్ట చివరివరకు కనీస సదుపాయాల కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అందేలా కృషి చేస్తానని, మధ్యతరగతి ప్రజల కోసం సైతం తగిన వసతులను కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here