శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ – ప్రేమ్ నగర్ బి బ్లాక్ వద్ద ఉన్న రైల్వే అండర్పాస్ సమీపంలోని నాలాలో గల్లంతైన వృద్ధుడు బాలయ్య (70) కుటుంబాన్ని కొండాపూర్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ పరామర్శించారు. ప్రేమ్ నగర్కు చెందిన బాలయ్య ప్రమాదవశాత్తు నాలాలో కొట్టుకుపోయిన విషయం తెలిసిన వెంటనే హమీద్ పటేల్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికులు, అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

గల్లంతైన బాలయ్య కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని పోలీసు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం, జలమండలి అధికారులను ఆయన కోరారు. అనంతరం బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హమీద్ పటేల్, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.





