జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం విధించిన నియమ నిబంధనలను తూచ తప్పకుండ పాటించాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగముగా నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, తదితర సందర్భాల్లో ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
నియమావళి లోని అంశాలు క్రిందివిధంగా ఉన్నాయి.
- ఎన్నికల్లో వినియోగించే కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటరు మరియు పబ్లిషరు వివరాలు, ముద్రించిన ప్రతుల సంఖ్య తప్పనిసరిగా నమోదు చేయాలి.
- ప్రభుత్వ ఆవరణలను పాడు చేయుట, గోడలమీద వ్రాతలు, పోస్టర్లు/ పేపర్లు అతికించడం వంటి పనులు చేయరాదు.
- పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథిన్ తో తయారైన పోస్టర్లు/ బ్యానర్ల వాడకం చేయకూడదు.
- ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే ప్రత్యేక ఉపకరణాల ఖర్చును అభ్యర్థి ఎన్నికల వ్యయ పట్టికలో తప్పనిసరిగా నమోదు చేయాలి.
- ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి సినిమాటోగ్రఫి, టెలివిజన్ తదితర ప్రచార సాధనాలు వినియోగించకూడదు.
- లౌడ్ స్పీకర్లు వాడడానికి సంబంధిత పోలీసు అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.
- బహిరంగ సమావేశాలు, రోడ్ షో లలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే అనుమతించబడతాయి.
- బహిరంగ సమావేశాలు ఉదయం 6 గంటల కన్నా ముందు, రాత్రి 10 గంటల దాటిన తరువాత నిర్వహించరాదు. ఎన్నికల పోలింగ్ ముగిసే సమాయానికి 48 గంటల ముందు నుండి పోలింగ్ ముగిసే వరకు ఎటువంటి పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు.
- ఓటర్లకు అధికారిక యంత్రాంగం ద్వారా అధికారిక ఫోటో గుర్తింపు స్లిప్ జారీ జరుగుతుంది. అభ్యర్థులు అనధికారిక పోలింగ్ స్లిప్పులు జారీ చేయకూడదు.
- ఎన్నికల ప్రచారానికి వేదికలుగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాలను ఉపయోగించకూడదు.
- అధికారం లో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించరాదు.
- పోలింగ్ అనంతరం ఎన్నికల ఖర్చు వివరాలను నిర్ణీత సమయంలో రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలి.