శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిఒక్కరు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ సూచించారు. ప్రజలకు సేవచేయడంలో, సమాజ సేవలో శ్రీ కృష్ణా యూత్ ఎల్లప్పుడూ ముందడుగు వేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యం అని, శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎప్పుడూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధుర నగర్ లో ఉచిత కంటి పరీక్షలు, వైద్యం, మందుల పంపిణీ నిర్వహించారు. ఈ క్యాంప్కు ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వర్ గౌడ్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది వ్యాధిని గుర్తించలేక వైద్యానికి దూరమవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు.
రోగికి వచ్చిన వ్యాధిని గుర్తించలేక హాస్పిటల్కి వెళ్లే స్థోమత లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ పోషణలో భాగంగా రోజు కూలి పనులకు వెళ్లి సరైన ఆహారం లేక ఈ కాలుష్యం వలన రోగాల బారిన పడుతున్నారని, అలాంటి వారికి వెన్నుదన్నుగా శ్రీ కృష్ణా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా గొప్ప పరిణామం అని అన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ మద్యపానానికి దూరంగా ఉండాలని చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే స్పందిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ గౌడ్, యాదగిరి, శశాంక్ రావు, వెంకటేష్ గౌడ్, నర్సింగ్ రావు, మూర్తుజా, గోపాల్, సంగమేష్, నర్సింహ, దేవేందర్, కిరణ్, శివ, లడ్డు, సాయినాథ్, నవీన్, దిలీప్, చిన్న, సాయి, గిరి, రాకేష్, రవి తదితరులు పాల్గొన్నారు.