శేరిలింగంపల్లి, జూన్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ టెక్నిషియన్లను ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో నూతనంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు కానీ సరైన టెక్నిషియన్లు లేరని, డయాలసిస్ రోగులు అధిక సంఖ్యలో ఉండి ఇబ్బందులు పడుతున్నారని, వారు నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్కు వెళ్తూ అవస్థలు పడుతున్నారని అన్నారు. కనుక కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ టెక్నిషియన్లను ఏర్పాటు చేయాలని కోరారు.