శేరిలింగంపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అర్జీలను పరిష్కరించడంలో విజయవంతంగా ప్రజావాణి కార్యక్రమం సాగుతుందని, నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఐఏఎస్ హేమంత్ భోర్ఖడేతో నియోజకవర్గ పరిధిలోని అనేక డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముఖ్యంగా వచ్చేది వర్షాకాలం కనుక డ్రైనేజీ, రోడ్లు, శానిటైజేషన్ సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏమైనా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని కోరారు. అధికారులు అందరూ డివిజన్లలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.