శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని శిల్పకళా వేదికలో జరిగిన ధన్య ప్రసాద్ కూచిపూడి అరంగేట్రం కళాభిమానులను ఆద్యంతం అలరించింది. భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశానికి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు అమూల్యమైన వారసత్వమని అన్నారు. భారతీయ సంప్రదాయ కళలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలోని 64 కళల్లో కూచిపూడికి విశిష్ట స్థానం ఉందని, ఈ కళను తదుపరి తరాలకు అందిస్తున్న గురువులు, కళాకారులు అభినందనీయులని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నృత్యాచార్యులు పద్మశ్రీ, పద్మభూషణ్ డా. రాజా రెడ్డి–డా. రాధా రెడ్డి దంపతులు, ప్రముఖ కూచిపూడి నర్తకి గురు కౌసల్య రెడ్డి, తన గురువు యామిని రెడ్డి ఆశీస్సులతో ధన్య ప్రసాద్ గణపతి వందనంతో తన తొలి నాట్య ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం శివ నాట్యం, కృష్ణ శబ్దం, తరంగం, ధనశ్రీ రాగంలో గీత్ ధునిక్ తకతైయ్ తదితర నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆమె అభినయం, నృత్య నైపుణ్యానికి సభికులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు దాసరి జై రమేష్, పోతినేని కోటేశ్వరరావు, వింధ్యరాణి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.







