శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం తెలంగాణ శాసన సభ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, లెజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు ఆస్ట్రేలియా దేశానికి చెందిన మంత్రులు రిచర్డ్ రీయర్డాన్, బ్రాండ్ బట్టిన్ లను ఘనంగా సన్మానించారు. ఆస్ట్రేలియా ప్రజా ప్రతినిధుల బృందానికి తెలంగాణ శాసన సభ, శాసన మండలి సభ మందిరాలను చూపించి అన్ని విషయాలను వివరించారు.
PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆస్ట్రేలియా మంత్రలకు సచివాలయంను స్వయంగా దగ్గరుండి చూపించి అన్ని వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మంత్రులు రిచర్డ్ రీయర్డాన్, బ్రాండ్ బట్టిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లెజిస్లేచర్ సభలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. లెజిస్లేచర్ కి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ కార్యాలయాన్ని, సచివాలయంను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, పృథ్వి గాంధీ, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, రామారావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.