నమస్తే శేరిలింగంపల్లి : రెండో విడత దళిత బందును రాజకీయ ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఎంపిక చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి మండల కార్యాలయం డిప్యూటీ ఎమ్మార్వో శంకరయ్యకు దళిత హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే వెంకటస్వామి వినతి పత్రం ఇచ్చారు. 2018 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎలక్షన్ల సందర్భంగా బిఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని, వాటిని అమలు చేయాలని ప్రభుత్వానికి తెలపాలన్నారు.
దళిత బందు సమర్థవంతంగా అమలు చేయడం, దళిత బంధు పథకంలో రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం, జీవో నెంబర్ 25 ను సవరించడం, గృహలక్ష్మి పథకానికి ప్రతి దళిత కుటుంబానికి వర్తింప చేసి, ఇంటి నిర్మాణానికి రూ . 10 లక్షల ఇవ్వడం, ప్రభుతో భూముల్లో నివాసం ఉంటున్న దళితుల కుటుంబాలకు జీవో నెంబర్ 58, 59 ప్రకారం ఇండ్ల పట్టాలు, పేదల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం భూమి లేకపోతే ప్రైవేటు భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి దళితులకు ఇవ్వడం, భూ పంపిణీకి అసైన్డ్ ల్యాండ్ కమిటీని పునరుద్ధరించడం వంటివి చేయాలనీ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా దళిత కుల పోరాట సంఘం ఇన్చార్జి సిపిఐ రామకృష్ణ, దళిత కుల పోరాట సంఘం శేరిలింగంపల్లి కార్యదర్శి ఎస్ కొండలయ్య, దళిత కుల పోరాట సంఘం శేరిలింగంపల్లి మండల అధ్యక్షులు జెట్టి శ్రీనివాస పాల్గొన్నారు.