- అలరించిన అన్నమయ్య కీర్తనలు.. మహానగర సంకీర్తన
నమస్తే శేరిలింగంపల్లి : తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడుగా వాసి కెక్కిన అన్నమాచార్యుల 616వ జయంత్యుత్సవాలు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు సారథ్యంలో అన్నమాచార్య భావనా వాహిని నేడు ఘనంగా జరిగింది. మొదట చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం శోభారాజు తన శిష్య బృందంతో కలిసి అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ మహానగర సంకీర్తన చేస్తూ ట్యాంక్ బండ్ మీద అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకున్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-23-at-8.41.39-PM.jpeg)
![](https://namastheslp.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-23-at-8.41.40-PM-1.jpeg)
అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం శోభారాజు తన శిష్యులు కలిసి ” హరిఅవతారమీతడు అన్నమయ్య, అప్పని వరప్రసాది, చాలదా, సిరుత నవ్వుల వాడు, విచ్చేయవమ్మా, చిత్తము కొలదీ, తందనాన మొదలగు చక్కటి కీర్తనలు పాడి శ్రోతలను భక్తి పారవశ్యం లో ముంచెత్తారు. ప్రముఖ నేపథ్య గాయనీమణులు మానసా ఆచార్య, గాయత్రి మొదలగు వారు కూడా ఇందులో పాల్గొన్నారు. అనంతరం చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు రంగరాజన్ మాట్లాడుతూ అన్నమయ్య తత్వాన్ని, వాటిని విశ్వవ్యాప్తం చేస్తున్న శోభారాజు సేవలను కొనియాడారు.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త డాక్టర్ అనంతలక్ష్మి మాట్లాడుతూ భక్తి ఎన్ని రకాలో వివరించి, అన్ని రకాలుగా అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించారని తెలుపుతూ, శోభారాజు సేవలను కొనియాడారు. ప్రముఖ చిత్రకారుడు బ్నిమ్, విద్యావేత్త తిరునగరి జ్యోత్స్న కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. వెంకటేశ్వరస్వామి వేషధారణలో సాందీప్, అన్నమయ్య వేషధారణలో మానస్ పటేల్ అందరినీ అలరించారు. చక్కటి ప్రసాదాలు, అల్పాహారాలతో కార్యక్రమం పూర్తయింది.