శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని ఇజ్జత్నగర్లో ఓ వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు బి. సునీతా నాయక్ అలియాస్ సోనీ (32) గృహిణి. ఆమె భర్త ధర్మేంద్ర కుమార్తో కలిసి ఇజ్జత్నగర్లోని ఓ ఇంట్లో సుమారు ఆరేళ్లుగా నివసిస్తోంది. సునీతకు సుమారు పదేళ్ల క్రితం ధర్మేంద్ర కుమార్తో వివాహం జరిగింది. ఆమె భర్తకు రెండో భార్య కాగా, ఈ దంపతులకు సంతానం లేదు. ధర్మేంద్ర కుమార్ మాదాపూర్లోని ఐటీ రహేజా పార్క్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.

బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ధర్మేంద్ర కుమార్ నైట్ డ్యూటీకి వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం 12:32 గంటల సమయంలో ఇంటి యజమాని రక్తపు భారతి.. సునీత తలుపు తీయడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ధర్మేంద్రకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న ధర్మేంద్ర.. ఇంటి యజమాని, మరో ఇద్దరితో కలిసి తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో సునీత చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందిన స్థితిలో కనిపించింది. ఆ సమయంలో ఇంట్లో మరెవరూ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 12:50 గంటల సమయంలో డయల్-112కు సమాచారం అందగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





