- BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని బీ ఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ అన్నారు. బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్, బి.ఎన్.హాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF)రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. కుంభం సుకన్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మాట్లా డారు. దేశంలో, రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో పాటు విద్య, వైద్య ఉపాధి లాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు సుముఖతంగా లేవని, ఓట్ల, సీట్ల కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకు రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం తమ ఎజెండాలైన మతాన్ని, ప్రాంతాన్ని, అవకాశవాదాన్ని వాడుకొని పనిచేస్తున్నాయని అన్నారు. అసలైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ప్రయోజనకరమైన కార్యాచరణ అమలు కోసం రూపకల్పన చేయకుండా తమ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ బీసీ జనగణన జరపాలని తీర్మానం చేసినప్పటికీ దాని అమలు కోసం కేంద్రంతో ఆందోళన చేసే పరిస్థితులలో లేదని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో, వారి సంక్షేమాన్ని అభివృద్ధి పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై బిఎల్ఎఫ్ భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర కమిటీ రూపకల్పన చేసిందని తెలిపారు. ఇంకా ఈ BLF రాష్ట్ర కమిటీ లో డిసెంబర్ 10 నుండి 30 వరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గలలో BLF పార్లమెంట్ కమిటీలు అలాగే శాసనసభ నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయాలని, 2023 జనవరి 25న BLF 5వ ఆవిర్భావం సందర్భంగా జనవరి 10 నుండి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా జీప్ జాత నిర్వహించాలని, జనవరి 25న హైదరాబాదులో భారీ ఎత్తున BLF సభ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. BLF రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, ఎస్ సిద్ది రాములు, కన్నం వెంకన్న, ఎం ఎం గౌడ్, వి తుకారాం నాయక్, సాయి కృష్ణ సమ్మయ్య పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/12/IMG-20221204-WA0001.jpg)