- మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళలు, కొత్తగూడెం సగర సంఘం
నమస్తే శేరిలింగంపల్లి : భద్రాచలంలో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవానికి వెళ్లేందుకు భాగ్యనగరం నుంచి తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఈ మహా పాదయాత్రకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సగర సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. మంగళ హారతులతో మహిళలు బ్రహ్మరథం పట్టారు. జిల్లా అధ్యక్షులు కొడిపాక మల్లేశం సగర ఆధ్వర్యంలో వందలాది మంది సగరులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికి కొత్తగూడెం పట్టణంలో పాదయాత్రను కొనసాగించారు. జైశ్రీరామ్.. జై భగీరథ.. జై సగర.. సగరుల ఐక్యత వర్ధిల్లాలి.. అనే నినాదాలతో మార్మోగించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-15-at-11.32.53-PM.jpeg)
ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ శ్రీరాముని వారసులుగా తాము భద్రాచలంలో జరగనున్న కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను ప్రతి ఏటా సమర్పించే ఆనవాయితీని ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రారంభ సంవత్సరం కావడంతో భాగ్యనగరం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రను కొనసాగిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో ఇక ప్రతి ఏటా సగరులం భద్రాచలం కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను, వడిబియ్యం అందజేయనున్నామని తెలిపారు. 17వ తేదీన జరగనున్న కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో సగరులు సీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-15-at-11.32.53-PM-1.jpeg)
బుధవారం భద్రాచలంలో జరగనున్న కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా సగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్షపతి సగర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ సగర, సగర సంఘం సీనియర్ నాయకులు కృష్ణ సగర, గుంటి మల్లేష్ సగర, రమణయ్య సగర, కనుగుల లక్ష్మీనారాయణ సగర, స్వరూప సగర, రాధిక సగర పాల్గొన్నారు.