- ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఛట్ పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అత్యంత పవిత్రంగా కొలిచే గొప్ప పండుగ ఛట్ పూజ అని , బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గుజరాత్, గయ, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా కార్తీకమాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారన్నారు. మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్థిస్తారని, సూర్యుని ఆరాధించడం వల్ల కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమౌతాయని నమ్ముతారని, పవిత్ర నదిలో పుణ్యస్నానం చేసి నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్యభగవానుని ఆరాధిస్తారని పేర్కొన్నారు.

దీపాలు వెలిగించి పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, మంత్రి ప్రగఢ సత్యనారాయణ, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.