శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిరోజు ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా 7వ రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్ గచ్చిబౌలి వార్డులో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక నివాసితులు, కాలనీ సంక్షేమ సంఘాల (RWAs) ప్రతినిధులతో ముఖాముఖి చర్చించి, పౌర సదుపాయాల స్థితిగతులను సమీక్షించారు. మణికొండ చెరువు కలుషితం అవుతుండటంపై నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు చుట్టూ అభివృద్ధి పనులతో పాటు, ఎస్టీపీ (STP) సౌకర్యాలను ఏర్పాటు చేసి దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కోరారు.

గుర్తించిన ఖాళీ స్థలాలను అన్ని వసతులతో కూడిన పార్కులుగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. SNDP ఫేజ్-II కింద పెండింగ్లో ఉన్న వర్షపు నీటి కాలువల (Storm Water Drains) పనులను చర్చించారు. హెచ్ఎండీఏ (HMDA) తో సమన్వయం చేసుకుని మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రైవేట్ నిర్మాణాల వల్ల రహదారి స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, దీనివల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని నివాసితులు ఫిర్యాదు చేశారు. హరిత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కాలనీ సంక్షేమ సంఘాలు (RWAs) చురుగ్గా పాల్గొని స్థానిక సమస్యలపై విలువైన సూచనలు అందించారు.
SWM రూల్స్ 2026 ప్రకారం నాలుగు రకాలుగా చెత్త వర్గీకరణ (4-way waste segregation) అమలుపై చర్చించారు. జనగణన (Census) స్వయం-నమోదు ప్రక్రియలో పౌరులు భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు. కమిషనర్ అన్ని విభాగాల అధికారులను ఆదేశిస్తూ.. ఆయా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో స్వీకరించాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం పాటిస్తూ, నిర్ణీత కాలవ్యవధిలో పనులను పూర్తి చేసి క్షేత్రస్థాయిలో మార్పు కనిపించేలా చూడాలని స్పష్టం చేశారు. పౌరులతో నిరంతరం మమేకమవుతూ, క్షేత్రస్థాయిలో సకాలంలో స్పందిస్తూ ప్రతి వార్డును పరిశుభ్రతకు, సుస్థిరతకు, సమర్థవంతమైన పౌర నిర్వహణకు నమూనాగా (Model Ward) మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.





