శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ.3.67 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వరద నీటి కాల్వలు, ఫుట్పాత్ నిర్మాణ పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. గోకుల్ ప్లాట్స్ కాలనీ, అయ్యప్ప సొసైటీ కాలనీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త రహదారులు, వరద నీటి కాల్వలతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతోపాటు కాలనీవాసులకు మెరుగైన రవాణా, డ్రైనేజీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.





