శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC సర్కిల్ – 48 పరిధిలో పెరుగుతున్న దోమల బెడదపై వెంటనే స్పందించిన బిజెపి సీనియర్ నాయకుడు పవన్ కుమార్ చొరవతో మదీనగూడ డివిజన్ శాంతినగర్ కాలనీలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని 400కి పైగా ఇళ్లలో ప్రతి ఇంటి పరిసరాల్లో లార్వా స్ప్రేను స్వయంగా పరిశీలన బృందంతో కలిసి ప్రత్యేక శ్రద్ధతో పిచికారీ చేయించారు. ఇటీవల కాలంలో దోమల సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, పవన్ కుమార్ ఈ అంశాన్ని GHMC ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టేలా కృషి చేశారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటిలో ముగ్గురు, నలుగురు చొప్పున సుమారు రెండు వేల మందికి పైగా స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉదయం లార్వా స్ప్రే, సాయంత్రం దోమల పొగమందు పిచికారీ నిరంతరంగా కొనసాగించేలా అధికారులతో సమన్వయం చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రోత్సాహం, విశ్వాసం తనకు మరింత సేవ చేయాలనే సంకల్పాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. మదీనాగుడ డివిజన్, శాంతినగర్ ప్రాంతాన్ని ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన GHMC అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.





