శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్పల్లి తండా గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం కిరీట సమర్పణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శంకరి లక్ష్మి, శంకరి అనంతయ్య దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి కిరీటాన్ని సమర్పించారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, కిరీట సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ శంకరి లక్ష్మి, అనంతయ్య దంపతులను దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

ఈ మహోత్సవానికి గోపన్పల్లి తండాతోపాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు, భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులు, శంకరి లక్ష్మి, అనంతయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





