శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (SBIRD) మెడికల్ ఆఫీసర్, ప్రముఖ జనరల్ ఫిజీషియన్, చందానగర్లోని విద్యా నర్సింగ్ హోమ్ వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు ఎనలేనివని అన్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ప్రతి వైద్యుడు సమాజానికి నిజమైన సేవకుడని కొనియాడారు.

డాక్టర్ నాగేశ్వరరావు ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో, మానవీయ దృక్పథంతో వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సేవలో వైద్యుల పాత్రను ఎల్లప్పుడూ గౌరవిస్తామని, సేవాభావం కలిగిన వైద్యులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల యామిని, దివ్య తదితరులు పాల్గొని డాక్టర్ నాగేశ్వరరావుకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.





