- తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు నటులు మహేష్ బాబు, చిరంజీవి రూ.1 కోటి చొప్పున విరాళం
- కదిలివస్తున్న చిత్ర పరిశ్రమ
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత వారం కిందట కురిసిన వర్షం కారణంగా జలమయం అయిన కాలనీలు ఇంకా నీటి నుంచి బయడపడలేదు. దీనికి తోడు మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గ్రేటర్లో అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే నగరవాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.550 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. వరదల వల్ల మునిగిపోయిన ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.10వేల సహాయం అందించనుంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా వరద బాధితులకు మంగళవారం ఆర్థిక సహాయం ప్రకటించారు.
నటులు మహేష్ బాబు, చిరంజీవిలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్లు చెరొక రూ.50 లక్షలు, విజయ్ దేవరకొండ, హారిక హాసిని క్రియేషన్స్ చెరొక రూ.10 లక్షలు, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్లు తలా రూ.5 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు.