శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ బి బ్లాక్ సమీపంలోని రైల్వే అండర్బ్రిడ్జి వద్ద నాలాలో కొట్టుకుపోయి ఆచూకీ తెలియని బాలయ్య కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రంగారావు, నవత రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అల్లావుద్దీన్, రవి యాదవ్, సంతోష్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఘటన తీవ్ర విషాదకరమని అన్నారు. వర్షాకాలంలో సీవరేజ్ పనులు చేపట్టకూడదని తెలిసినా పనులు నిర్వహించడం, అలాగే కాంట్రాక్టర్ తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

శాసనసభ్యుడు, అధికారులు వెంటనే చొరవ తీసుకుని బాలయ్యను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ బాలయ్యకు ఏదైనా అపాయం జరిగితే ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందించాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, సంగారెడ్డి, విజయరెడ్డి, కిరణ్ యాదవ్, మమత, తిరుమలేష్, సుదర్శన్, బాలరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.





