శేరిలింగంపల్లి, ఆగస్టు 1 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారుల సౌకర్యం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు లక్ష్యంగా ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీసులు నవ్య (ఐక్యత) జంక్షన్ వద్ద పలు ట్రాఫిక్ మార్పులు చేపట్టారు. నవ్య (ఐక్యత) జంక్షన్ నుంచి గ్రీన్ మెడోస్ కాలనీ వైపు వెళ్లే వాహనదారుల కోసం ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ మరింత సాఫీగా సాగనుంది. అలాగే బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సులభంగా ఉండేలా ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేశారు. ఇక బీరంగూడ నుంచి లింగంపల్లి వైపు వచ్చి అశోక్నగర్-పటాన్చెరు రోడ్ వైపు వెళ్లే వాహనాల కోసం ట్రయల్ ప్రాతిపదికన ట్రాఫిక్ కోన్స్, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి యూ-టర్న్ సౌకర్యాన్ని కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ మార్పులు అమలు చేస్తున్నట్లు ఆర్సీ పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.






