- 12 గంటలుగా కొనసాగుతున్న కొండ విజయ్ కుమార్ విచారణ
- ఆందోళనలో కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, అభిమానులు
శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లికి చెందిన బంగారు బాబు, హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి బయలుదేరిన కొండ విజయ్ కుమార్ ను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గురువారం సాయంత్రం స్థానిక ఐటీ అధికారులు అడ్డుకొని పాన్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం కొండ విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడి ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులు నలుగురు వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్ పోర్టు లోనే విచారణ ప్రారంభించారు.

తనఒంటిపైన ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు వారి పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 12 గంటల పాటు విచారించిన అధికారులు అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతిని ఇచ్చారు. అనంతరం మళ్లీ వారిని విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అయితే సీజ్ చేసిన బంగారాన్ని తిరిగి ఇస్తారా, వారిని విడుదల చేస్తారా అనేది వారి ఇన్కమ్ టాక్స్ చెల్లింపుల పైన ఆధారపడి ఉంది.






