నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయినగర్ లో శిశుమంగళ్ అనాథ శరణాలయంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలికల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలకు పండ్లు , నోట్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికల హక్కులు, భద్రత, విద్య, వైద్యం తదితర అంశాలపై దృష్టి సారించటానికి ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 11 వ తేదీని ప్రపంచ బాలికల దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు, లింగ వివక్షకు గురవటం, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో కొంతమంది పెద్దలు అమ్మాయిల శరీరాలను టచ్ చేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. చూసేవారికి అది మాములు గానే అనిపించినా ఎదిగే పిల్లలకు తాకే వ్యక్తుల మనస్తత్వం అర్ధం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రులు తమపిల్లలకు తమని తాము రక్షించుకోవడానికి అనేక అవకాశాలు కల్పించాలి అన్నారు. పిల్లల ప్రవర్తన గమనించాలని, తమ పిల్లలు లైంగిక వేధింపులకు గురైతే చట్టపరంగా ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాలని చెప్పారు. అధ్యాపకులు సైతం పిల్లల మానసిక పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలని, ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెరగటానికి తల్లిదండ్రులు, అధ్యాపకులు కృషిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం యూఎన్ఓ ఒక థీమ్ తో ఈ బాలిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం థీమ్ డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ అని అన్నారు. పౌరసమాజం బాలిక సంరక్షణకై కృషిచేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ మరియు భారత్ వికాస్ పరిషత్తు ఆర్యభట్ట శాఖ అధ్యక్షుడు వి. ఫణికుమార్, ఆశ్రమ నిర్వాహకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
