మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన మియపూర్ డివిజన్ పరిధిలోని తన క్యాంప్ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు హమీద్ పటేల్, సాయిబాబా, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, జానకి రామ రాజు, లక్ష్మీ బాయి, నవత రెడ్డి, పూజిత గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులతో రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో నెలకొన్న రెవెన్యూ సమస్యలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని కార్పొరేటర్ లకు సూచించారు. ఈ సమస్యలపై శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ తో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ అధికారులకు వివరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ ప్రాంత రెవెన్యూ సమస్యలు మరియు జీవో నెం 58 మరియు 59 ల పై పేద కుటుంబాల సమస్యలను పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. పేదల కలలను నిజం చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్నో ఏండ్ల రెవెన్యూ సమస్యలు పరిష్కరించే దిశలో పయనిస్తున్నామన్నారు. ఆయా డివిజన్లకు సంబందించిన సమస్యలపై కార్పొరేటర్లు సమగ్ర సమాచారం తో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మన ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు సమిష్టి కృషి చేద్దామని పిలుపిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ అద్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్పేట్ డివిజన్ అధక్షుడు గౌతమ్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు.