శేరిలింగంపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు తమ వద్దకు తీసుకువచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజల కోసం పనిచేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల వెంటే ఉంటామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జీ.హెచ్.ఎం.సి అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై పక్కా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని, డివిజన్ల పరిధిలో పెండింగులో ఉన్న పనులు సంబంధిత అధికారులతో కలిసి పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. నగర మేయర్ గద్వాల్ వినాయలక్ష్మిని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాదాపూర్, హఫీజ్ పేట్, కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్మశానవాటికల అభివృద్ధి పనులు, మంజీర పైప్ లైన్ రోడ్డు, నల్లగండ్ల చెరువు అభివృద్ధి, నాలా పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేతృత్వంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు నగర అభివృద్ధికి నిరంతరం చర్చిస్తూ, హైదరాబాద్ నలుదిక్కుల చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నిరంతరం జోన్ పరిధిలో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే మంజీర రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను స్టాండింగ్ కమిటీలో చర్చించి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.