నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్పేట్ డివిజన్ బిజెపి కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భారతరత్న, స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని అటల్ బిహార్ వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయత, ఉదారత, మానవత కలగలిసిన మేరుశిఖరమని, ప్రత్యర్థులను సైతం తన వాగ్దాటితో మంత్రముగ్దులను చేయడమే కాకుండా రాజకీయాలను కవిత్వాన్ని సమతూకం చేస్తూ దేశ రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా నిలిచిన మహనీయులు అని అన్నారు. బిజెపి పార్టీని స్థాపించి అధికారాన్ని సాధించి భారత ప్రధానిగా దేశాన్ని దేవాలయంగా, సమాజాన్ని కుటుంబంగా కనీసం సొంత ఇల్లు కూడా లేని బ్రహ్మచారిగా అహర్నిశలు భరతమాత సేవలో తరించిన కర్మయోగి అని అన్నారు. భారతీయ జనతా పార్టీ మెరు శిఖరం, బీజేపీ కార్యకర్తలకు మార్గ దర్శకులు, స్ఫూర్తి ప్రధాత అటల్ బిహారి వాజ్ పేయి అని కొనియాడారు. అలాంటి మహోతన్నత వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుందని ఆయన దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎన్నటికి మరువరని ఇప్పుడున్న కార్యకర్తలకు, యువతకు మార్గదర్శకంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్, రవి గౌడ్, వర ప్రసాద్, మాణిక్ రావు, బాబు రెడ్డి, లక్ష్మణ్, కళ్యాణ్, రామకృష్ణ, విజేందర్, వినోద్, గణేష్, శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
