సూర్యచంద్రులున్నంత వరకు దళిత బాంధవుడు కేసీఆర్ పేరు నిలిచిపోతుంది: మందగడ్డ విమల్కుమార్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని దళితుల కోసం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని దళిత సంఘాల నాయకులు తరళి వెళ్లారు. ఆ యాత్రను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి దళిత ఐక్య వేదిక నేత మందగడ్డ విమల్కుమార్ మాట్లాడుతూ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో దళితుల అభ్యున్నతికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. దేశంలోని ఏ ప్రభుత్వం సైతం దళితులకు ఇంత గొప్ప ఆర్ధిక సాయం చేసిన దాఖలాలు లేవని, భవిష్యత్తులోను ఎవరితో సాధ్యం కాదని అన్నారు. దళితబంధు పేరుతో దళిత బాంధవుడని నిరూపించుకున్న కేసీఆర్కు రాష్ట్రంలోని యావత్ దళితులు అండగా నిలబడతారని అన్నారు. దళిత జాతిలో కొత్త వెలుగులు నింపుతున్న కేసీఆర్ పేరు సూర్యచంద్రులున్నంత వరకు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి నుంచి పెద్ద ఎత్తున దళితులం హుజూరాబాద్లో కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపెందుకు బయలుదేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నేతలు పీవై రమేష్, కంది జ్ఞానేశ్వర్, మహిళ నేత రజని తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ కు తరలివెళ్లిన దళిత సంఘాల నాయకులతో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్